Latest News: News Newsమరింత విలువైన సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చేసి మన Forum లో Register అవండి. NewsRegister అయిన తరువాత Account ని Actvate చేయటం మరిచి పోకండి, Activate చేయుటకు మీ Mail చూడండి.

Monday, September 5, 2011

జన లోక్‌పాల్‌లో జనులెవ్వరు?

జన లోక్‌పాల్‌లో జనులెవ్వరు? 
By
- ఎం. చెన్న బసవయ్య, డి.రవీందర్, ఎస్.మల్లేష్



భారత ప్రజాస్వామ్యంలో లోక్‌పాల్ వ్యవస్థ ఒకటి ఉండాలని నాలుగైదు దశాబ్దాల నుంచి ఒక డిమాండ్ కొనసాగుతూ వస్తూన్నది. ఇటీవల పలు పౌర సమాజ గ్రూపులు ఉద్యమాలు చేపట్టడంతో ఆ డిమాండ్ పటిష్టమైంది. అయితే ఈ ప్రక్రియ రెండు విపరీత ధోరణులకు దారితీసింది. ఇటు ప్రభుత్వం ఒక రకమైన పట్టుదలకు పోతే అటు 'టీమ్ అన్నా' అనబడే పౌర సమాజంలోని ఒక గ్రూపు మరో రకమైన విపరీత ధోరణికి పోయింది. 

చివరకు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది కాకుండా ఇటు ప్రభుత్వం, ప్రతిపక్షాలు, అటు టీమ్ అన్నా కూడా తమ తమ పోకడలను కొంత సరిచేసుకోవడంతో కొంత సందిగ్ధం తొలగింది. పార్లమెంటు తీర్మానం చేసింది. అన్నా దీక్ష విరమించుకున్నారు. అయితే పార్లమెంటు తీర్మానం ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే. అది చట్టంగా రూపొందడానికి వివిధ స్థాయిలలో చేపట్టవల్సిన చట్ట రూపకల్పన ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో పలు అంశాలపై విస్తృత చర్చ కొనసాగవలసిన అవసరముంది. 

ప్రభుత్వ ముసాయిదా అసంపూర్ణమైనది. పలు లోపాలతో కూడుకున్నది. అందువల్లే పలు ప్రత్యామ్నాయ ముసాయిదాలను పౌర సమాజ గ్రూపులు ముందుకు తీసుకువచ్చాయి. ప్రభుత్వ ముసాయిదాలోని అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అయితే టీమ్ అన్నా ముసాయిదాలో అన్నీ సమర్థమైన అంశాలు ఉన్నాయి, లోటుపాట్లు ఏమీ లేవు అనుకోవడం పొరపాటు. ఇది, ఇంతవరకు వారి చేతుల్లోనే పన్నెండు సార్లు సవరణకు గురికావడం దానిలోని అంశాల బలహీనతలను తెలియజేస్తుంది. కావున టీమ్ అన్నా రూపొందించిన 'జన లోక్‌పాల్' పై ఒక విమర్శనాత్మక పరిశీలన అవసరం. 

మౌలికంగా టీమ్ అన్నా జన లోక్‌పాల్‌లో 'జనులు ఎవరు' అనే ప్రశ్నను వేయాల్సివుంటుంది. ఎందుకంటే 121, 01, 93, 422 మంది జనాభా కలిగి, సామాజికంగా (కుల, మత, లింగ, భాషా, ప్రాంతం) విలువలు, సంస్కృతీ, భావాలు ఇంకా అనేక అంశాలతో వైవిధ్య భరితమైన సమాజంలో టీమ్ అన్నా మొత్తం భారత పౌర సమాజంలో మిగతా గ్రూపులలో ఒక గ్రూపు అవుతుందే కాని, మొత్తం భారత పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహించలేదు. 

మరి వారే ప్రకటించుకున్నారా? మీడియా సృష్టించిందా? ఏది ఏమైనా పట్టుమని పది మంది కలిసి, అందునా సుమారుగా అందరూ ఒకే సామాజిక శ్రేణికి చెందినవారు, మేమే పౌర సమాజ ప్రతినిధులం, ఇతర పౌర సమాజ సంస్థల కంటే మాకే అవినీతిని ఎదుర్కొనే జ్ఞానం ఉన్నది, మేము చెప్పిందే వేదం, కావున మా ముసాయిదానే పార్లమెంటు ఆమోదించాలని అనడం ఒక కుంభకోణం లేదా దుందుడుకు వాదం అవుతుంది. 

టీమ్ అన్నా అనుసరించిన పోకడలు ప్రజాస్వామ్యమైనవా? రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియలకు అనుగుణంగా ఉన్నాయా? అసలు అవి గాంధేయమైనవా? అనే వాటిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటి జోలికి పోకుండా 'జన్ లోక్‌పాల్' ముసాయిదాలోని కొన్ని ముఖ్య అంశాలను పరిశీలించి ఏ విధంగా అవి నేడున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతులకు విరుద్ధమో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవీ, (సంక్షిప్తంగా) జన లోక్‌పాల్ ముసాయిదాలోని అంశాలు: 

(అ) జన లోక్‌పాల్ వ్యవస్థ ఎన్నుకోబడే వ్యవస్థ కాదు. అది కేవలం కొంత మంది కలిసి ఎంపిక చేసుకోబడే వ్యవస్థ. సెలక్షన్ కమిటీలోని పలువురు సభ్యులు ఈ దేశ ప్రజలకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎలాంటి జవాబుదారీగా ఉండరు. (ఆ) ఇది ఒక కార్యనిర్వాహక వ్యవ స్థ. దీనికి దర్యాప్తు, శిక్షించే అధికారాలుంటాయి. కానీ దేశ కార్య నిర్వాహక శాఖకు గానీ, పార్లమెంటుకు కానీ జవాబుదారీగా ఉండదు. ఉన్న త న్యాయవ్యవస్థకు కూడా జవాబుదారీగా ఉండదు. 

(ఇ) ఎంపీ లు, న్యాయమూర్తులు, ప్రధానమంత్రిని విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉంది. దీనిలో భాగంగా జన లోక్‌పాల్ ప్రధాన మంత్రితో సహా ఏ అధికారి ఫోన్‌నైనా ట్యాప్ చేయడం, ఇతరత్రా సమాచార వ్యవస్థలను అడ్డుకునే పద్ధతులను ఉపయోగించే అధికారముంది. (ఈ) జన లోక్‌పాల్ వే సిన శిక్షను న్యాయస్థానంలో సవాల్‌చేసే అవకాశముంది. అయితే దాని ఇతర కార్యకలాపాలపై కోర్టులలో అప్పీలుకు వెళ్ళే అవకాశం లేదు. 

(ఉ) ఈ వ్యవస్థలో పోలీసు, కోర్టుల విధులు రెండూ ఒకటిగా కలిసి ఉంటాయి. ఎవరిపైన అయినా సూమోటోగా విచారణ చేపట్టవచ్చు. ఏ సంస్థనైనా ఇది బ్లాక్ లిస్టు చేయవచ్చు. ఏ లైసెన్స్‌నయినా రద్దు చేయవచ్చు. పెనాల్టీలు విధించే, ఆస్తులు జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. (ఊ) జన లోక్‌పాల్ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో కేవలం 11మంది సభ్యులే వున్నా, దాని (వేల సంఖ్యలోని) ఉద్యోగులు లోక్ పాల్ చట్టపు అన్ని అధికారాలను కలిగివుంటారు. 

ఇంత విపరీతమైన దర్యాప్తు, శిక్షించే అధికారాలతో సహా లోక్‌పాల్ అధికారులు ఒక వేళ తమ అధికారాన్ని నిస్సహాయ సామాన్యులపై ప్రయోగించే ప్రయత్నం చేస్తే !? ఈ వ్యవస్థలో చేరిన ఉద్యోగులందరూ అన్నా హజారే వలే ఎలాంటి దురాకర్షణకు లోనుకాకుండా ఉండగలరా? (ఎ) జన లోక్‌పాల్‌కు కేంద్ర ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను శిక్షించే, తీసివేసే అధికారముంది. (ఏ) ఎంపీలపై విచారణ చేపట్టే అధికారం ఇంతవరకు పార్లమెంటు అధికార పరిధిలో ఉంది. 

దీనిని కూడా జన లోక్‌పాల్ అదనంగా సమకూర్చుకుంది. దీనితో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తమ విశిష్ట అధికారాన్ని కోల్పోతారు. తన సభ్యులపై చర్యలు తీసుకునే స్వాతంత్య్రాన్ని, స్వయం ప్రతిపత్తిని పార్లమెంటు కోల్పోతుంది. ఇదే విధంగా న్యాయశాఖ కూడా తన స్వాతంత్య్రాన్ని కోల్పోతుంది. తద్వారా న్యాయశాఖ స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ దానిలోని సభ్యుల జవాబుదారీ తనానికి ఉద్దేశించిన మరో ప్రత్యేక జుడీషియల్ కమిషన్ బిల్లును జన లోక్‌పాల్ అడ్డుకొంటున్నది. 

(ఐ) జన లోక్‌పాల్ సభ్యుల ఎంపిక ప్రక్రియలోని అంశాల ప్రకారం సెలెక్టయ్యే సభ్యులు తమ జీవితంలో ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధం కలిగి ఉండటం అనర్హం. మరి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలలో పనిచేసి ఉంటే ఏమవుతుంది అనే అంశంపై వివరణ లేదు. (ఒ) జన లోక్‌పాల్ వ్యవస్థ కేంద్ర స్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రాల స్థాయిలో అచ్చం ఇదే తరహా అధికారాలతో లోకాయుక్తలు ఏర్పడాలి. వీటన్నిటినీ పరిశీలిస్తే టీమ్ అన్నా అభిప్రాయంలో కేవలం విపరీతమైన అధికారాలతో అత్యంత కేంద్రీకృత సర్వాధికార వ్యవస్థలే అవినీతిని ఎదుర్కోగలవు. 

అంటే గాంధీ సిద్ధాంతపు మౌలికాంశమైన అధికార వికేంద్రీకరణ అవినీతి నిరోధక వ్యవస్థకు పనికిరాదు! ఇక ఇప్పుడు ఈ అంశాలు ప్రజాస్వామిక లక్షణాలకు, రాజ్యాంగ మౌలికసూత్రాలకు ఎలా భిన్నంగా ఉన్నాయో చూద్దాం. (అ) ప్రజల ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికతో సంబంధం లేకుండా కేవలం నియమితమయ్యే సంస్థ సకల అధికారాలు కలిగివుండడం ప్రజాస్వామ్య సూత్రాలకు, పరిపాలనకు విరుద్ధం. (ఆ) నిజానికి జన లోక్‌పాల్ కార్యనిర్వహక వ్యవస్థకు గాని, పార్లమెంటుకు గాని జవాబుదారీ కాక పోవడమే కాకుండా, న్యాయవ్యవస్థ అధికారాలను సహితం సంతరించుకోవడం రాజ్యాంగ విరుద్ధం. (ఇ) ఉన్నత న్యాయవ్యవస్థలను పర్యవేక్షించడం, విచారణ చేపట్టే అధికారం జన లోక్‌పాల్‌కు కల్పించడం 'స్వతంత్ర న్యాయవ్యవస్థ' అనే రాజ్యాంగ సూత్రాన్ని బలిచేయడమే అవుతుంది. 

దీనివల్ల 'రూల్ ఆఫ్ లా' అనే న్యాయసూత్రం కూడా ప్రమాదమెదుర్కోవల్సి వస్తుంది. (ఈ) రాజ్యాంగంలోని 14వ అధికరణ చట్టం ముందు పౌరులకు సమానత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇది నిర్హేతుక, ఇతర పక్షపాతాల నుంచి పౌరులను కాపాడుతుంది. జన లోక్‌పాల్‌కు ఎంపికయ్యే సభ్యులు గతంలో రాజకీయ పక్షాలతో సంబంధం లేకుండా ఉండడమే కాక అవినీతి చట్టాల కింద చార్జిషీట్ చేయడబడకుండా ఉండాలి (చార్జిషీట్ చేయబడడం, దోషిగా నిరూపించబడడం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి). ఇవి పక్షపాత ధోరణి కిందకు వస్తాయి. కనుక ఈ అనర్హతలకు సంబంధించిన అంశాలు 14వ అధికరణకు విరుద్ధం. 

(ఉ) జన లోక్‌పాల్ ముసాయిదాలో సామాజిక న్యాయం, జెండరు న్యాయం అనే అంశాల ప్రస్తావనే లేదు. దీనిని బట్టి టీమ్ అన్నా ఎటువంటి సామాజిక విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో విశదమవుతున్నది. (ఊ) పైన పేర్కొనబడినవే కాకుండా ఒక వేళ టీమ్ అన్నా జన లోక్‌పాల్ ముసాయిదాను యథాతథంగా చట్టంగా మారిస్తే, రాజ్యాం గ సవరణకు, పార్లమెంటుకు ఉన్న పరిమిత అధికారాలకు సైతం అది వ్యతిరేకమవుతుది.వీటన్నిటినీ పరిశీలనలోకి తీసుకుంటే టీమ్ అన్నా అనుసరిస్తున్న పద్ధతులే కాకుండా వారు ప్రతిపాదించిన జన లోక్‌పాల్ ముసాయిదాలోనే పలు అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పోకడలు ఉన్నాయని అర్థం కాగలదు. 

నేడు భారతదేశంలో ఒక లోక్‌పాల్ వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రజలు, పౌర సమాజపు సంస్థలు ఒక వాస్తవాన్ని గమనించాలి. అదేమిటంటే మనం అవినీతిని నిరోధించడానికి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల సమతౌల్యాన్ని భంగపరచకూడదు. ప్రముఖ ఆర్థిక వేత్త ప్రణబ్ బర్దన్ ఇలా అన్నారు: 'దేశంలోని ప్రజాప్రాతినిధ్య సంస్థలు నేడు ఎంత చెడుగా పనిచేస్తున్నా వాటిని పటిష్టం చేయడానికి, ప్రజాస్వామిక నియంత్రణలు చేపట్టడానికి అనేక పద్ధతులున్నాయి. 

నేను ఉద్యమాలను సమర్థిస్తాను కాని అవి ప్రాతినిధ్య సంస్థలను తిరస్కరించడం చాలా ప్రమాదం. ఇట్లాంటి సంఘటనలు జరిగిన ఇతర దేశాలలో చివరకు ప్రభుత్వాలపై ప్రజా ఆమోదం క్షీణించడంతో వాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల స్థానంలో అథారిటేరియన్ వ్యక్తులు అధికారంలోకి రావడం గమనించవచ్చు. ఈ ప్రమాదం భారత్‌కు పొంచి ఉందని కాదు కాని ప్రాతినిధ్య సంస్థల పట్ల అనాదరణ ధోరణులు ఇలాగే కొనసాగుతూపోతే మున్ముందు ప్రజాస్వామ్య ప్రక్రియలకు ఆదరణ కరువవుతుంది' 

- ఎం. చెన్న బసవయ్య, డి.రవీందర్, ఎస్.మల్లేష్
(ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)

Sunday, September 4, 2011

ఆచార్యదేవోభవ

సోర్సు      హరివిల్లు


అఆలు నేర్పిన ఉపాధ్యాయుడినుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. ద గైడ్‌. జీవనయానంలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే అక్షరాలు దిద్దిననాటినుంచి వెన్నంటి ఉండి, తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా, ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అందుకే పూర్వం తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకు ఇచ్చి ఆచార్యదేవోభవ అన్నారు. అసలు గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చారంటే వారికి లభించిన గౌరవం, మన్నన అర్థం చేసుకోవాలి.
పురాణేతిహాసాల్లో ఓ విశ్వామిత్రుడు, ఓ ద్రోణాచార్యుడు తమ శిష్యులైన రామలక్ష్మణులను, అర్జునుడిని ఎలా తీర్చిదిద్దారో, వారిమధ్య గురుశిష్య సంబంధం ఎలా పరిఢవిల్లిందో తెలుసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆనాటితో పోలిస్తే….ఇప్పుడు గురుశిష్య సంబంధాలు గతితప్పాయి. వారిమధ్య అప్పుడు గౌరవం, మన్నన ఉంటే ఇప్పుడు ఆయావర్గాల మధ్య స్నేహం పెరిగింది. ఆధునికభారతదేశంలో గురువంటే ఎలా ఉండాలో, శిష్యులపై ఎలాంటి ముద్రవేయాలో ఆచరించి చూపిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ క్షణాన తలుచుకోవాల్సిందే. ఆయన చూపినబాటలో ఉపాధ్యాయ, విద్యార్థివర్గం పయనించాల్సిందే.

మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్‌ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.
తన జన్మదినోత్సవానికి బదులు ఈ రోజును టీచర్స్‌డేగా జరుపుకోవాలని కోరారు. అప్పటి నుంచి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. మన దేశంలో టీచర్స్‌ డేకు సెలవు లేదు. ఈ రోజును ‘సెలబ్రేషన్స్‌ డే’గా ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని పాఠశాలల్లో విద్యార్థులనే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించేటట్టు చేస్తారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల భయం పోయి వారి పట్ల గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి.
సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు. 1888 సంవత్సరం సెప్టెంబర్‌ 5న జన్మించిన ఆయన 1975 ఏప్రిల్‌ 17న మృతిచెందారు. ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా దేశ అధ్యక్షుడిగా1962 నుంచి 1967వరకు పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు.
ప్రారంభ జీవితం, విద్య…
సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాస్‌ రెసిడెన్సీలోని తిరుత్తణి ప్రాంతంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో (ప్రస్తుత తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లా) ఆయన జన్మించారు. ఆయన మాతృభాష తెలుగు. ఆయన తల్లి పేరు సీతమ్మ. ఆయన బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతి ప్రాంతాల్లో గడిచింది. ఆయన తండ్రి రెవిన్యూ అధికారిగా పనిచేశారు. తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్‌లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్‌ ఎవాంజెలికల్‌ లూథర్‌ మిషన్‌ స్కూల్‌లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అనంతరం ఎం.ఎ. పూర్తిచేశారు. ఇక డాక్టర్‌ రాధాకృష్ణన్‌ అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.
గొప్ప ప్రొఫెసర్‌గా…
కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్‌ జార్జ్‌ వి చైర్‌ ఆఫ్‌ మెంటల్‌ అండ్‌ మోరల్‌ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు. ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్‌(1931), భారతరత్న (1954), ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అనంతరం మైసూర్‌ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.
ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్‌ ద క్వెస్ట్‌, జర్నల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆప్‌ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్‌ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్‌ రవీంద్రనాథ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్‌ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్‌ ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య బనారస్‌ హిందూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్‌ బనారస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్‌ రాధాకృష్ణన్‌ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.
గురువును దైవంగా భావించి…
అనాదిగా మన దేశంలో గురువును దైవంగా భావించారు. తల్లి,తండ్రి, గురువులు దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ‘గురు బ్రహ్మ…గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ… గురు సాక్షాత్‌ పరబ్రహ్మ… తసై్మ శ్రీ గురవే నమః’ అని గురువును కీర్తించారు. గురువు త్రిమూర్తులతో సమానమని గురువును అభివర్ణించారు. ఒకప్పుడు మన దేశంలో గురుకులాలు ఉండేవి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చిన్నవయసులోనే చేర్పించేవారు. అక్కడ గురువులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి కొంతకాలం తర్వాత వారిని తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించేవారు. పురాణ ఇతిహాసాల్లో కూడా గురువులను చాలా గొప్పగా చూపించారు.
శ్రీరాముడు, లక్ష్మణుడు చిన్నతనంలో గురువు విశ్వామిత్రుడి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అడవుల్లోకి వెళ్లి రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వద్ద ఉన్నారు. అస్త్ర శస్త్ర విద్యలతోపాటు సకల విద్యలు విశ్వామిత్రుడు నేర్పించారు. వారికి అన్ని విద్యలు నేర్పిన తర్వాత తిరిగి తండ్రి దశరథుడి వద్దకు పంపించారు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు సకల శాస్త్రాలు, అస్తశ్రస్త్ర విద్యలు నేర్పించారు. పాండవుల్లో అర్జునుడికి విలు విద్యను, భీముడికి గదాయుద్ధంలో శిక్షణనిచ్చారు. పాండవులు, కౌరవులను అన్ని విద్యలను నేర్పించిన గురువు ద్రోణాచార్యుడు. ఇక ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని రూపొందించి ఆయన్ని తన గురువుగా భావించి సొంతంగా అస్తశ్రస్త్రాలు నేర్చుకున్నాడు. అన్ని విద్యల్లో ఆరితేరాడు.
ఈ విధంగా పురాణ ఇతిహాసాల్లో గురువులకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఆనాడు పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా గురుకులాల్లో ఉంటూ గురువు వద్ద అన్ని విద్యలు నేర్చుకునేవారు. పూర్తిగా విద్యాబుద్ధులు నేర్చుకున్న అనంతరం గురువు వారిని తల్లిదండ్రులకు పంపించేవారు. ఇక నేడు కాలం మారింది. గురుశిష్యుల మధ్య అనుబంధం కూడా మారింది. నేడు విద్యార్థులు గురువులకు సరైన గౌరవ, మర్యాదలు ఇవ్వడం లేదు. అదేవిధంగా కొందరు గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పడంలో పూర్తి శ్రద్ధవహించడం లేదు. కాలేజీలలో గురువులను ఎదిరించి మాట్లాడుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతిఏటా సెప్టెంబర్‌ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవంనాడు గురుశిష్యుల పవిత్రబంధం గురించి తెలియచేసుకోవాలి. విద్యార్థులు గురువులకు ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలను ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురువులు కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్తి శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను కూడా ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది.

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…


దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలోకెక్కారు. దేశంలోని తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఆమె ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్యాబోధన చేశారు. ఇక స్ర్తీ విద్య కోసం పాటుపడిన సంఘసేవకురాలు సావిత్రిబాయి. ప్రముఖ సంఘసేవకుడు జ్యోతిరావ్‌పూలే భార్య సావిత్రిబాయి ఆ కాలంలో మహిళా విద్య గురించి ఎంతో తపించారు. దళిత వర్గంలో పుట్టిన ఈ దంపతులు బ్రిటీష్‌ వారి కాలంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. ఇక సావిత్రిబాయి పూలే దళితుల కోసం 1852లో మొదటి పాఠశాలను కూడా ప్రారంభించడం విశేషం.
ఆ కాలంలో స్ర్తీలు బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి ఛాందసులు ఆమెపై కుళ్లిన గుడ్లు, ఆవు మాంసం, టమాటాలు, రాళ్లు విసిరి హింసించేవారు. కానీ సావిత్రిబాయి వీటికి జంకకుండా ధైర్యంగా తిరిగేవారు. ఆమె భర్త జ్యోతిరావ్‌ పూలే తన భార్యకు పూర్తి అండగా ఉంటూ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె దేశంలోనే మహిళల కోసం 1848లో తొలి పాఠశాలను ప్రారంభించి అక్కడ మొదటి ఉపాధ్యాయినిగా పాఠాలు బోధించారు. మొదట వివిధ కులాలకు చెందిన తొమ్మిది బాలికలు ఆమె పాఠశాలలో చేరి చదువుకున్నారు. ఆ తర్వాత సమాజంలో కొంత మార్పు వచ్చి తల్లిదండ్రులు తమ అమ్మాయిలను చదువుకునేందుకు పాఠశాలకు పంపించడం ప్రారంభించారు. దీంతో సావిత్రిబాయి మహిళల కోసం మరో ఐదు పాఠశాలలను ప్రారంభించడం విశేషం. చివరికి బ్రిటీష్‌ ప్రభుత్వం స్ర్తీ విద్య కోసం ఆమె కృషిని గుర్తించి ఘనంగా సత్కరించింది.


Search This Blog

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Bluehost Coupons